తెలంగాణ అసెంబ్లీలో యుద్ధ వాతావరణం నెలకొంది. స్పీకర్ ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ సభ్యుడు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సభలో అధికార పార్టీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. వెంటనే స్పీకర్ కు సభ సాక్షిగా క్షమాపణలు చెప్పాలని మంత్రులు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు క్లారిటీ ఇచ్చారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ ను జగదీశ్ రెడ్డి అవమానించలేదని అన్నారు. 'సభ మీ ఒక్కరిది కాదు.. అందరిది అని' మాత్రమే అన్నారని స్పష్టం చేశారు. 'మీ' అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో ఎందుకు నిరసన చేశారో.. సభను ఎందుకు వాయిదా వేశారో తెలియదని ఎద్దేవా చేశారు. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయకపోతే అవిశ్వాసం పెడతామని హరీశ్ రావు అన్నారు.