న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు అందరూ రెడీ అవుతున్నారు. వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ప్రధానంగా రూల్స్ బ్రేక్ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని మెచ్చరిస్తున్నారు. డీజేలు వాడకూడదని, మ్యూజికల్ ఈవెంట్స్ అయితే ఇండోర్లో మాత్రమే జరుపుకోవాలని సూచిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని హైదరాబాద్లోని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నారు. ట్యాంక్బండ్ చుట్టూ రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో వైన్స్, బార్లు, పబ్బుల టైమింగ్స్ ను ఎక్సైజ్ శాఖ గంట పాటు పొడిగించింది. మద్యం దుకాణాలను అర్ధరాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంచవచ్చని తెలిపింది. మరో వైపు రాత్రి 8 గంటల నుంచే డ్రంకన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు నిర్వహించనున్నారు పోలీసులు. డ్రంకన్ డ్రైవ్ కేసులో మొదటిసారి పట్టుబడితే 10 వేల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రెండోసారి పట్టుబడితే 15 వేల జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు డ్రగ్స్ సేవించి పట్టుబడినోళ్లపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. ఇలాంటి కేసుల్లో బెయిల్ లభించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.