కాళేశ్వరం వివాదంలోకి అనవసరంగా తనను లాగుతున్నారని, 43 ఏండ్లుగా రాజకీయాల్లో ఎక్కడ కూడా తెలిసి తప్పు చేయలేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పష్టంచేశారు. మాజీ సీఎం కేసీఆర్ తప్పును ఈటల తన భుజాలపై వేసుకుంటున్నాని.. కమిషన్ముందు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో హరీశ్ రావు ఇంకా అబద్ధాలు ఆడేందుకు ప్రయత్ని స్తున్నారని ఫైర్ అయ్యారు. అవసరం అనుకుంటే ఆధారాలతో సహా ఎవరితో నైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సెక్రటేరియట్ లో తుమ్మల మాట్లాడుతూ 'ఈటల ప్రకటన అవాస్తవం. కమిషన్ అడిగిన ప్రశ్నలకు పొంతన లేకుండా సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం డిజైన్ల కేబినెట్ ఆమోదమే లేదు. సబ్ కమిటీకి ఈప్రాజెక్టుకు అసలే సంబంధమే లేదు. ప్రాణహిత చేవెళ్లపైనే మేం రిపోర్టు ఇచ్చాం. రాష్ట్రానికి లాభం జరిగే సూచనలే ఆనాడు చేశాం. ఉమ్మడి నిర్ణయం అని ఈటల చెప్పడం సరికాదు. త్వరలోనే కమిషన్ కు లేఖ రాస్త. అవ సరమైతే జీవో కూడా బయటకు ఇస్తం' అని అన్నారు.