సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లారా.. కాసులకి కక్కుర్తి పడకండి అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై స్పందించిన ఆయన.. ట్విట్టర్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై ఆయన.. ఇన్ఫ్లుయెన్సర్లు ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేయకండి అని సూచించారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని.. మీరు సోషల్ మీడియాలో వదిలే ఇలాంటి వీడియోల వల్ల అమాయకులు ఆన్ లైన్ బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులు అవుతున్నారని, బంగారు జీవితాలను చిద్రం చేసుకుంటున్నారని తెలిపారు. అలాగే మీ స్వలాభంకోసం ప్రజాశ్రేయస్సును విస్మరించడం ఎంత వరకు సమంజసం అని, సమాజ క్షేమం పట్టని మీ పెడధోరణులు క్షమించరానివి అని మండిపడ్డారు. కష్టపడకుండానే కాసులు పోగేసుకోవాలన్న ఆలోచన అనర్థదాయకమైనదని యువత గుర్తించాలని హితవు పలికారు. ఇక స్వార్ధ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి.. చాపకిందనీరులా సామాజిక సంక్షోభాన్ని సృష్టిస్తున్న ఆన్ లైన్ బెట్టింగ్ మాయలో పడకండి అని, ఇలాంటి సంఘవిద్రోహ శక్తులకు దూరంగా ఉండండి అని హెచ్చరిస్తూ.. సజ్జనార్ ఈ పోస్ట్ ను తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేశారు.