MLC Kavitha : పింక్ బుక్ లో అందరి చిట్టా రాస్తున్నా.. జూపల్లిపై కవిత ఫైర్
నాగర్ కర్నూల్ జిల్లా సింగోటంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి చెబుతున్నా... కచ్చితంగా పింక్ బుక్ మెయిన్ టెయిన్ చేస్తామనీ.. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే ఎంత పెద్ద నాయకులైనా, అధికారులనైనా ఎవరిని వదిలిపెట్టబోమని చెప్పారు. పింక్ బుక్కులో అందరి చిట్టా రాసుకుంటామన్నారు. మాకు కూడా టైం వస్తుంది... అప్పుడు అందరి సంగతి చెప్తామనీ.. మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ కార్యకర్తలను తీవ్రంగా వేధిస్తున్నారని చెప్పారు. చిన్న విమర్శ చేసినా, ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టిస్తున్నారనీ.. శ్రీధర్ రెడ్డి అనే కార్యకర్తను దారుణంగా చంపేసినప్పటికీ పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేయడం లేదని అన్నారు కవిత. కాంగ్రెస్ నాయకులు హంతకులకు కొమ్ముకాస్తున్నారనీ,.., తమ మీటింగు కోసం ఫ్లెక్సీలు కడితే పరమేశ్వర్ అనే కార్యకర్తపై జూపల్లి దాడి చేయించారని ఆరోపించారు కవిత. "ఇదేమి రాజ్యం ? కాంగ్రెస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారు ? కొల్లాపూర్ నియోజక వర్గానికి జూపల్లి కృష్ణారావు టూరిస్ట్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఆయన నియోజకవర్గానికి వస్తున్నారు. సన్న వడ్లకు బోనస్ అని చెప్పి బోగస్ చేసింది ప్రభుత్వం. రైతు భరోసా, రుణమాఫీ గ్రామాల్లో సగం మందికి కూడా రాలేదు" అని కవిత విమర్శించారు.