FAKE LOANS: చేయని అప్పు... రైతులకు ముప్పు
దరఖాస్తు చేసుకున్న పాపానికి రైతుల పేరుమీద అప్పులు... రూ. 10 కోట్ల మేర అక్రమాలు
చేయని అప్పుకు ఆ రైతులు బాధ్యులయ్యారు..! దరఖాస్తు చేసుకున్న పాపానికి వారి పేరుమీద అప్పు తీసుకుని స్వాహా చేశారు. బకాయిలు చెల్లించాలని... నోటీసులు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు లోతుగా విచారిస్తే రైతుల పేరిట 10 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తేలింది. రంగంలోకి దిగిన C.I.D అధికారులు తీగలాగే పనిలోపడ్డారు. నాగర్కర్నూల్ జిల్లా పూర్వ అమ్రాబాద్ మండలంలో రైతు రుణాల పేరిట జరిగిన సుమారు 10కోట్ల అక్రమాలపై ప్రస్తుతం CID విచారణ కొనసాగుతోంది. తీగలాగితే డొంక కదిలినట్లు... నాలుగైదేళ్ల కిందట జరిగిన అక్రమాల పర్వం ఒక్కొక్కటి బయటపడుతోంది. అమ్రాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘంలో 2017 నుంచి 2019 వరకూ అచ్చంపేట D.C.C.B బ్యాంకు నుంచి రుణాల కోసం చాలామంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వారెవ్వరికీ రుణాలు అందలేదు. కానీ కొన్నేళ్ల తర్వాత బకాయి ఉన్నారంటూ నోటీసులు అందాయి. దీనిపై తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము రుణాలే తీసుకోలేదని బ్యాంకు అధికారులకు తెగేసి చెప్పారు. దీంతో అధికారులు లోతైన విచారణ జరపగా..1827 ఖాతాలకు సంబంధించి సుమారు 10 కోట్ల మేర అక్రమంగా రుణాలు మంజూరైనట్లు గుర్తించారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో C.I.D రంగంలోకి దిగి ప్రస్తుతం అమ్రాబాద్, పదర మండలాల్లోని వివిధ గ్రామాల్లో విచారణ జరుపుతోంది. ఈ విచారణలో అక్రమాలు జరిగిన తీరు ఒక్కొక్కటిగా బయటపడుతోంది.
అప్పటి పీఏసీఎస్ ఛైర్మన్, బ్యాంకు మేనేజరు కుమ్మక్కై తమ పేరిట రుణాలు మంజూరు చేసి.. ఆ డబ్బుల్ని నొక్కేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అందుకోసం అప్పట్లో ప్రతి గ్రామంలో వారు తమ ఏజెంట్లను నియమించుకున్నారని... రుణాలు ఇప్పిస్తామని ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ సహా ఇతర దస్త్రాలను సేకరించారని చెబుతున్నారు. భూమిలేని వారి పేరుమీదా, మరణించిన రైతుల పేరుమీద రుణాలు మంజూరు చేసి అందిన కాడికి దండుకున్నారు. ఈ క్రమంలోనే నకిలీ దస్త్రాల సృష్టి, ఫోర్జరీ సంతకాలు, బ్యాంకును మోసం చేసి రుణాల మంజూరు, ఇతరుల పేరుమీద డబ్బుల స్వాహా లాంటి అనేక చట్ట వ్యతిరేక కార్యకాలాపాలకు పాల్పడ్డారు. ప్రస్తుతం బ్యాంకు నుంచి నోటీసులు అందుకున్న బాధితులు లబోదిబో మంటున్నారు. తీసుకోని రుణాన్ని వడ్డీతోసహా చెల్లించమంటే ... తాము..ఆ రుణాలు కట్టలేమని వాపోతున్నారు. శాఖాపరంగా చర్యలకు ఉపక్రమించిన డీసీసీబీ అధికారులను ఉన్నతధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారు. జరిగిన అక్రమాలపై జవాబు ఇవ్వాలంటూ నోటీసులు సైతం జారీ చేసింది. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ప్రస్తుతం వారి ఆస్తుల జప్తునకు సైతం రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నాగర్కర్నూల్ డీసీఓ ఫిర్యాదు మేరకు ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నామని, దర్యాప్తు పూర్తైన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని... సీఐడీ అధికారులు వెల్లడించారు.
లక్ష్మణ్, ఇన్స్పెక్టర్, సీఐడీ ఈ రుణకుంభకోణానికిబాధ్యులెవరో గుర్తించి వారి నుంచే డబ్బు రికవరీ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.