సాగు చేసే రైతులందరికీ రైతుభరోసా ఇవ్వాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఐటీ చెల్లింపు, భూమి పరిమితి పెట్టవద్దని అభిప్రాయపడింది. సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగుభూములను ప్రభుత్వం గుర్తించనుంది. రైతుభరోసా కోసం జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. సంక్రాంతి (జనవరి 14) నుంచి ఈ స్కీంను అమలు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం.
రైతు భరోసాకు కోతలు విధించేందుకు రేవంత్ సర్కార్ కుస్తీలు పడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రుణమాఫీకి షరతులు పెట్టి లబ్ధిదారులను తగ్గించారని ఆరోపించారు. రైతు భరోసా పథకానికి రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటారని ఆక్షేపించారు. మొత్తంగా సాగు చేసే వారికే భరోసా అందాలి. అసలైన రైతుకే ఆర్థిక సాయం అందించే ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటే… రైతు భరోసా ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.