Formula E Race Case : ఐరోపాలో ఫార్ములా ఈ రేస్ కేసు ఏ2 అర్వింద్

Update: 2025-06-17 05:35 GMT

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 2గా ఉన్న ఐఏఎస్ అధికారి, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్ విదేశీ పర్యటన చర్చనీయాంశంగా మారింది. అప్పటి మంత్రి, ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ను ఏసీబీ విచారిస్తున్న తరుణంలో అర్వింద్ కుమార్ విదేశాల్లో ఉండటం రాజకీయంగా విమర్శలకు తావిచ్చింది. అయితే ఆయన యూరోప్లో చదువుతున్న తన కూతురి గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొనేందుకు ప్రభుత్వ అనుమతితోనే వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ నెల 2నుంచి 30వరకు ఆయనకు విదేశాలకు వెళ్లేందుకుగానూ ప్రభుత్వం అనుమతితులతో సెలవును మంజూరీ చేసింది. ఇందుకు ఏప్రిల్ 15న అప్పటి సీఎస్ శాంతికుమారి ఆయనకు సెలవును మంజూరీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో అవకతవకలు జరిగాయని.. భారీగా నిధుల మళ్లింపు జరిగిందని నిర్ధారించిన ఏసీబీ ముగ్గురిపై ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసింది.

ఇందులో ఏ1గా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డిని చేర్చుతూ ఏసీబీ కేసు ఫైల్ చేసింది. ఏసీబీ కేసు నమోదు చేయడంపై కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కేసును కొట్టివేయాల్సిందిగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా.. న్యాయస్థానంలో కేటీఆర్ కు ఊరట లభించింది. మొదటి రెండు సార్లు జరిగిన విచారణలో గత ఏడాది డిసెంబర్ 31 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. అనంతరం డిసెంబర్ 31న జరిగిన విచారణలో కేటీఆర్ను ఎలాంటి అరెస్ట్ చేయవద్దంటూ పోలీసులను ఆదేశిస్తూ.. తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. తాజాగా మరోసారి ఏసీబీ విచారణ ముమ్మరం చేయడంతో కేటీఆర్ హాజరవుతున్నారు. ఆయన అరెస్టుపై అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయన కూడా తన అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కీలక సమయంలో ఏ2 అర్వింద్ కుమార్ లేకపోవడంపై రాజకీయ పార్టీలు విమర్శలు చేశాయి. దీంతో ప్రభుత్వం స్పందించిఆయన సెలవు ఉత్తర్వులను వెలుగులోకి తెచ్చింది. అర్వింద్ కుమార్ వచ్చే నెలలో రాష్ట్రానికి రానున్నారు.

Tags:    

Similar News