దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుగా అభ్యుదయ రైతులకు అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. అందులో భాగంగా వైఎస్ఆర్ పేరు మీద ఒక ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా బంజారాహిల్స్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.
వచ్చే వర్ధంతి కల్లా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసి వ్యవసాయ రంగంలో నిష్ణాతులైన వారిని, వ్యవసాయంపై రీసెర్చ్ చేస్తున్న వారిని, ఈ ప్రాంత అభివృద్ధికి వ్యవసాయ రంగానికి దోహదపడుతున్న వారిని గుర్తించి వైఎస్ఆర్ పేరుమీద అవార్డులు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్ ను నిత్యం స్మరిస్తూ.. వారి ఆలోచనను ముందుకు తీసుకువెళతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే మొదట గుర్తుకువచ్చేది వ్యవసాయం.. ప్రాజెక్టులేనని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. రెండు జీవనదుల్లో ప్రవహిస్తున్న నీటిని ప్రాజెక్టులు కట్టి నీటిని పంట పొలాలకు పారించిన ఆలోచన వైఎస్ఆర్ ది అని చెప్పారు. వైఎస్ఆర్ భౌతికంగా లేనిలోటును ఎవ్వరూ రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు తీర్చలేరని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు