PCC Chief : హరీశ్ మీడియేటర్.. ఈటలతో కేసీఆర్ చర్చలు.. పీసీసీ చీఫ్ సంచలనం
కాళేశ్వరం నోటీసులపై కేసీఆర్ తో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చర్చలు జరిపారని, అందుకు హరీష్ రావు మధ్యవర్తిగా వ్యవహరించారని టీపీసీసీ చీఫ్ బి. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శామీర్ పేటలోని ఒక ఫాంహౌస్ లో హరీష్ రావు, ఈటల భేటీ అయ్యారని, అక్కడినుంచే కేసీఆర్ తో ఈటల ఫోన్లో మాట్లాడారని చెప్పారు. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కయిందని తాము చేసిన ఆరోపణలు నిజమయ్యాయని, ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న ఆరో పణలే అందుకు నిదర్శనమన్నారు. శుక్రవారం గాంధీభవన్లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, టీపీసీసీ అధికార ప్రతినిధులు సంధ్యారెడ్డి, నిజాముద్దీన్, సినీనటి దివ్యవాణితో కలిసి ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా ఒక్కటేనని తాము చెబుతున్నది నిజమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారని, అంతేగాక, ముడుపులకు తమ వారు అమ్ముడుపోతారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారని, కవిత, రాజాసింగ్ ఆరోపణలకు ఆ రెండు పార్టీలు ముఖ్యంగా కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు మహేశ్ గౌడ్. కవిత చెబుతున్న దాంట్లో నిజముందని తాను నమ్ముతున్నానని కూడా టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గతంలో ఆరోపించారని, నోటీసులకు సంబంధించి ప్రధాని మోడీ వైపు ఈటల ఉంటారా ? కేసీఆర్తో ఉంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కేసీఆర్ కు ప్రయోజనం కలిగేలా అనుకూలంగా నోటీసుకు సమాధానం ఇస్తే మోడీని మోసం చేసినట్లేనని కూడా మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఈటల బీజేపీలో ఉన్నప్పటికీ, ఆయన మనసంతా బీఆర్ఎస్పీనే ఉంటుందన్నారు. రాజాసింగ్ ఆరోపించినట్లుగా బీఆర్ఎస్ నుంచి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్, ఈటల ఎవరికి ముడుపులు అందాయో కూడా చెప్పాలని కోరారు.