తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తూర్పు, పశ్చిమ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఇవాళ ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్ , జనగామ, మహబూబాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఇప్పటికే పడుతున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్ సహా పలువ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.