నైరుతి ఆగమనం తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. రుతుపవనాలు వచ్చి రావడంతోనే కుంభవృష్టిని తెచ్చాయి. నైరుతి రుతుపవనాలు విస్తరణతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసాయి. హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. అర్ధరాత్రి వరకు కురిసిన ఎడ తెరపిలేని వానతో భాగ్యనగరం అల్లకల్లోలమైంది. ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అని తేడా లేకుండా అన్ని ప్రధాన ప్రాంతాల్లో వరుణుడు దంచికొట్టాడు. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో విరుచుకుపడిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపేశారు. కొన్ని చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరద ప్రవాహానికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి.
షేక్పేటలో అత్యధికంగా 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్లో 6.5 సెంటిమీటర్, ఫిలింనగర్లో 5.5, గచ్చిబౌలిలో 5, షేక్పేట్లో 4.6, రాజేంద్రనగర్లో 4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. మొండా మార్కెట్లో 3.9, చర్లపల్లి, బేగంపేట్లో 3.1, చంద్రాయనగుట్ట, విజయనగర్ కాలనీలో 2.8, అమీర్పేటలో 2.6, మెహదీపట్నంలో 1.9, మౌలాలిలో 1.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో GHMC, హైదరాబాద్ విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమయ్యాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సిబ్బందిని GHMC అధికారులు ఆదేశించారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో మూడ్రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు.
అటు ఏపీలోను భారీ వర్షాలు కురిసాయి. రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. కోస్తాంధ్ర, రాయలసీమకు విశాఖ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజులు తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.