హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో తరలిస్తున్న కోటి రూపాయలకు పైగా హవాలా నగదును పోలీసులు సీజ్ చేశారు. డబ్బు తరలిస్తున్న ఇన్నోవా కారుతోపాటు ఇద్దరిని అదుపులోకితీసుకున్నారు. ఈ హవాలా డబ్బు దుబ్బాక బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు బావమరిది సురభి శ్రీనివాస రావు కారులో తరలిస్తుండగా పట్టుకున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. శ్రీనివాస రావుతోపాటు డ్రైవర్ రవిని అరెస్టుచేసినట్లు తెలిపారు. వీరిదగ్గరనుంచి స్వాధీనంచేసుకున్న సెల్ ఫోన్లో కీలక సమాచారం ఉందని సీపీ వెల్లడించారు.
అయితే ఈ డబ్బు దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్నట్లు గుర్తించామని సీపీ అన్నారు. మంగళవారం ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో హవాలా డబ్బు తరలింపుపై దృష్టిపెట్టినట్లు సీపీ తెలిపారు. దీనిలో భాగంగా నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కోటికిపైగా స్వాధీనంచేసుకున్నట్లు వెల్లడించారు. బేగంపేట్లో మాజీఎంపీ వివేక్కు చెందిన.... విశాఖ ఇండస్ట్రీస్ కార్యాలయం నుంచి డబ్బులు తీసుకుని వెళుతున్నట్టు శ్రీనివాసరావు విచారణలో అంగీకరించారని సీపీ చెప్పారు.
హవాలా డబ్బు తమదేనంటు వస్తున్న వార్తలను దుబ్బాక బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు ఖండించారు. ఆ డబ్బుతో తమకు ఎలాంటి సంబంధం లేదని రఘునందన్తోపాటు మాజీ ఎంపి వివేక్ వెల్లడించారు. టీఆర్ ఎస్ నేతలే కావాలని తమ పేరును బదనాం చేస్తున్నారని వారు ఆరోపించారు.