స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకపోతే ఆయనపై అవిశ్వాస తీర్మానం పెడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు హెచ్చరించారు. ‘సభ మీ ఒక్కరిది కాదు అందరిదీ అని జగదీశ్ రెడ్డి అన్నారు. “నీ” అన్న మాట ఆయన అనలేదు. “మీ” అనే పదం సభ నిబంధనలకు విరుద్ధమేమీ కాదు. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసనలు చేశారో, సభను ఎందుకు వాయిదా వేశారో తెలీదు’ అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ అసెంబ్లీలో, బయటా అసత్యాలే మాట్లాడుతున్నారని, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారారని హరీశ్ రావు విమర్శించారు. TVVP డాక్టర్లు, నర్సులు, హోం గార్డులు సహా ఇతర సిబ్బందికి వెంటనే వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ’13 రోజులు గడుస్తున్నా వైద్యారోగ్య శాఖలోని TVVP సిబ్బందికి జీతాలు చెల్లించలేదు. పోలీసు శాఖలోనూ ఇదే దుస్థితి. దుష్ప్రచారంతో ఇంకెంత కాలం వెళ్లదీస్తారు?’ అని ప్రశ్నించారు.