రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ ప్రజలకు అందించేలా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలిదశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2096 పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలకూ అమలు చేయనున్నారు. సీఎం రేవంత్ రేపు దీనిని ప్రారంభిస్తారు. ఈ కనెక్షన్ తీసుకుంటే వర్చువల్ నెట్వర్క్, టెలిఫోన్, పలు ఓటీటీలను చూడవచ్చు. 20 ఎంబీపీఎస్ స్పీడ్తో నెట్ వస్తుంది. త్వరలోనే అన్ని గ్రామాలకు దీనిని విస్తరించనున్నారు. దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే లక్ష్యంతో భారత్ నెట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి రూ.2,500 కోట్లను కేటాయించింది. ఈ పథకం కింద గ్రామాల్లో ప్రతి ఇంటికి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ఫైబర్ నెట్ కనెక్షన్ను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవస్థ ఏర్పాటు బాధ్యతను టీ ఫైబర్ సంస్థ తీసుకుంది.