మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని చెప్పారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన తనకు అధికారులు కనీస గౌరవం ఇవ్వడం లేదన్నారు. నియోజకవర్గంలో ప్రొటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. తాను ఓడిపోతే బాగుండేదని.. ఇంట్లో కూర్చునేవాడినని చెప్పారు. మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, లక్షారెడ్డి సహా పలువురు హాజరయ్యారు.
ఆ తర్వాత మాట్లాడిన ఈటల రాజేందర్.. బడి, గుడి అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ మద్యం, గంజాయిని విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని మండిపడ్డారు. దీంతో యువత చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని.. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ప్రొహిబిషన్ శాఖ ప్రమోషన్ శాఖగా మారిందని విమర్శించారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు తమ పనులతో ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం కల్పించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర పథకాలు అనే వ్యత్యాసం చూపకుండా ప్రజలకు మంచి జరిగేలా చూడాలన్నారు.