TG : అసద్ను ముస్లింలే పట్టించుకోరు.. ఓవైసీ విసుర్లపై జగదీశ్ రెడ్డి సీరియస్
అహంకారం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందంటూ హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసదుద్దీన్ను ముస్లిం సోదరులే పట్టించుకోరనీ.. అతడి గురించి మాట్లాడటం వేస్ట్ అంటూ వ్యాఖ్యానించారు. ఎవరి జాతకాలు ఏంటో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. మజ్లిస్ వల్లే హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సీట్లు గెలిచిందంటూ అసదుద్దీన్ కామెంట్స్ చేశారు. మూసీపై కేటీఆర్ సహా గులాబీ నేతలు షో చేస్తున్నారన్న అసద్.. పదేళ్లలో మూసీ సుందీరకరణ ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. తాము నోరు విప్పితే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేరన్నారు. అసద్ వ్యాఖ్యలను ఖండించిన జగదీశ్రెడ్డి మూసీ ప్రాజెక్టును మొదలు పెట్టింది తామేనన్నారు. తాము చెప్పిన బడ్జెట్లోనూ పూర్త చేసే సత్తా తమకు ఉందని జగదీశ్రెడ్డి అన్నారు.
మరోవైపు.. టీటీడీని వక్ఫ్ బోర్డుతో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పోల్చడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. 1947లో వక్ఫ్ దగ్గర ఎంత భూమి ఉందని ప్రశ్నించారు. ఇప్పుడు 10 లక్షల ఎకరాలు ఎక్కడ నుంచి వచ్చాయన్నారు రాజాసింగ్. వక్ఫ్ బోర్డు పేరు మీద రైతుల భూములు, హిందూ ఆలయాల భూములను కబ్జా చేశారని మండిపడ్డారు. త్వరలోనే చట్టం వస్తుందన్నారు. వక్ఫ్ పేరుతో కబ్జా చేసి భూమి ఎలా ఉపయోగించాలో త్వరలో వచ్చే చట్టం స్పష్టం చేస్తుందని రాజాసింగ్ అన్నారు.