Kamareddy Triple Death Case : విషాదంగా ముగిసిన కామారెడ్డి ట్రిపుల్ డెత్ కేసు
కామారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన ముగ్గురి అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. భిక్కనూరు ఎస్సై సాతెల్లి సాయికుమార్, బీబీపేట కానిస్టేబుల్ కమ్మరి శ్రుతి, బీబీపేటకు చెందిన కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ బుధవారం అదృశ్యం కాగా, తరువాత వారి మృతదేహాలను వెలికితీశారు. ఈ కేసులో సంచలన విషయాలు పోలీసులు వెలుగుచూస్తున్నాయి. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఎస్సై సాయికుమార్ తన కారులో వెళ్లినట్లు భిక్కనూరు టోల్ప్లాజా వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డి మండలం నర్సన్నపల్లి శివారులో ఆయన్ని శ్రుతి, నిఖిల్ కలిశాక.. అక్కడి నుంచి ఒంటి గంట ప్రాంతంలో అడ్లూర్ఎల్లారెడ్డి పెద్దచెరువు ప్రాంతానికి చేరుకున్నట్లు సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించారు. అనంతరం ముగ్గురూ అదృశ్యమయ్యారనే సమాచారం అందుకున్న సదాశివనగర్ పోలీసులు అగ్నిమాపక శాఖ సిబ్బందితో బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ ఎస్సై కారు, శ్రుతి, నిఖిల్ల పాదరక్షలు, సెల్ఫోన్లు కనిపించడంతో ఏకబికిన 13 గంటలపాటు గాలించారు. అర్ధరాత్రి దాటాక రెండు మృతదేహాలు, గురువారం ఉదయం మరో మృతదేహం కనిపించాయి. మెదక్ జిల్లాకు చెందిన ఎస్సై సాయికుమార్కు భార్య, మూడేళ్ల కుమారుడు ఉండగా.. భార్య ప్రస్తుతం గర్భిణి. శ్రుతికి వివాహం కాగా.. అయిదేళ్ల కిందట విడాకులు తీసుకున్నారు.