కేసీఆర్ 25 చెరువులను కార్పొరేట్కు ఇచ్చేశారు.. ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంచలనం
రాష్ట్ర ప్రభుత్వంతో సహా హైడ్రాకు చిత్తశుద్ధి లేదని బీజేపీ శాసనసభ్యులు పాయల్ శంకర్ ఆరోపించారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో హైడ్రా పేరుతో హడావుడి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పేదలు, మధ్యతరగతి కుటుంబాలకే టార్గెట్ చేస్తోందని విమర్శించారు.
నిజంగా హైడ్రాకు, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నాలాలు, చెరువులను కబ్జాల చెర నుంచి విడిపించడానికి ప్రయత్నం చేయాలని కోరారు పాయల్ శంకర్. కబ్జాలకు పాల్పడి చెరువులను ఆక్రమించుకున్న కట్టడాలను కూల్చితే బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే, హైడ్రా పేరుతో జరుగుతున్న తంతు చూస్తుంటే అనేక అనుమానాలకు తావిస్తోందని మండిపడ్డారు. 2022లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చెరువుల సుందరీకరణ పేరుతో హైదరాబాద్లో 25 చెరువులను బడా కంపెనీలకు ధారదత్తం చేసిందని, వాటిని కాపాడాలని డిమాండ్ చేశారు.
వివిధ కంపెనీలు ఆయా చెరువుల్లో కబ్జాలకు పాల్పడి ఎస్టీఎల్ పరిధిలోకి చొచ్చుకొచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు పాయల్ శంకర్. సల్కం చెరువులో అక్రమంగా ఎంఐఎంకు సంబంధించిన ఫాతిమా కాలేజీ నిర్మాణం చేపడితే ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు.