వైద్యవిద్య పీజీ సీట్ల బ్లాకింగ్ దందా..ఈడీకి కీలక సమాచారం..
మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 1.4 కోట్ల రూపాయలతో పాటు కళాశాల బ్యాంకు ఖాతాలోని 2.89 కోట్లను స్వాధీన పరుచుకున్నట్లు వెల్లడించింది.;
వైద్యవిద్య పీజీ సీట్ల బ్లాకింగ్ దందాలో ఈడీకి కీలక సమాచారం లభించింది. తెలంగాణలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఈ దందా జరిగిందనే సమాచారంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 12 కళాశాలల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ జిల్లా దక్కన్, రంగారెడ్డి జిల్లా పట్నం మహేందర్రెడ్డి, భాస్కర్, మేడ్చల్ జిల్లా మల్లారెడ్డి, మెడిసిటీ, కరీంనగర్ జిల్లా ప్రతిమ, చలిమెడ, నల్గొండ జిల్లా కామినేని, సంగారెడ్డి జిల్లా ఎంఎన్ఆర్, మహేశ్వర, ఖమ్మం జిల్లా మమత, మహబూబ్నగర్ జిల్లా ఎస్వీఎస్ వైద్య కళాశాలల్లో రాత్రి వరకు కొనసాగిన సోదాల్లో పలు పత్రాల్ని, డిజిటల్ పరికరాల్ని ఈడీ స్వాధీనం చేసుకొంది. వాటిని విశ్లేషిస్తోంది. మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి చెందిన మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 1.4 కోట్ల రూపాయలతో పాటు కళాశాల బ్యాంకు ఖాతాలోని 2.89 కోట్లను స్వాధీన పరుచుకున్నట్లు వెల్లడించింది. ఈ సొమ్ముకు తగిన ఆధారాలను సమర్పించడంలో కళాశాల నిర్వాహకులు విఫలం కావడంతో జప్తు చేసింది.
ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల బ్లాకింగ్పై కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇచ్చిన ఫిర్యాదుపై వరంగల్ మట్టెవాడ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈడీ కేసు నమోదు చేసింది. కొందరు విద్యార్థులతో ప్రైవేటు మెడికల్ కాలేజీలు కుమ్మక్కై పీజీ సీట్లను బ్లాక్ చేస్తున్నాయని తమ అంతర్గత విచారణలో తేలిందని వర్సిటీ ఇచ్చిన సమాచారంపై ప్రధానంగా దృష్టి సారించింది. అలాంటి విద్యార్థుల యూజర్ ఐడీ, పాస్వర్డ్ల ఆధారంగా దళారులే దరఖాస్తు చేసి ఉంటారనే అనుమానంతో ఆరా తీసింది. మాప్-అప్ రౌండ్ కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు విద్యార్థుల పేరిట సీట్లను బ్లాక్ చేయించి.. అనంతరం వాటిని వదులుకోవడం ద్వారా కాలేజీలే కేటాయించేలా చేశారని గుర్తించింది. అలాంటి సీట్లను కోటి నుంచి రెండున్నర కోట్ల చొప్పున విక్రయించినట్లు ఆధారాలు సేకరించింది. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను విచారించగా.. అయిదుగురు విద్యార్థులు దరఖాస్తే చేయలేదని గుర్తించింది.
మాప్-అప్ రౌండ్ పూర్తయ్యేవరకు సీటు బ్లాక్ చేయించి తర్వాత వదులుకుంటే వర్సిటీ అపరాధ రుసుం విధించాలన్న నిబంధన ఉంది. గతంలో 5 లక్షలుగా ఉన్న అపరాధ రుసుంను ఇటీవలే 20 లక్షలకు పెంచారు. దీన్ని విద్యార్థుల తరఫున ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలే చెల్లించినట్లు ఈడీ తాజాగా గుర్తించింది. బ్లాక్ చేసిన సీట్లను విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్ములో నుంచే ఆ చెల్లింపులు జరిపినట్లు ఆధారాలు సేకరించింది. సీట్ల బ్లాకింగ్ దందాలో యాజమాన్యాలు ఆర్జించిన కోట్ల రూపాయలను ఎటు మళ్లించారో తెలుసుకునే పనిలో నిమగ్నమైంది.