కొత్త ఎమ్మెల్సీలుగా శుక్రవారం ప్రమాణం చేశారు కోదండరామ్ రెడ్డి, అమేర్ అలీఖాన్. మంత్రులు పొంగులేటి, పొన్నం సమక్షంలో మండలి చైర్మన్ గుత్తా వారితో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా కోదండరామ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తానేమీ కత్తి పెట్టి బెదిరించి ఎమ్మెల్సీ తీసుకోలేదని కోదండరాం అన్నారు.
ఎమ్మెల్సీ అవగానే తనకేమీ కొమ్ములు రాలేదని చెప్పారు ప్రొపెసర్. తన అలోచనలు అసలు మారలేదని ... అధికారం అనుభవించడానికి తాను ఎమ్మెల్సీ కాలేదని.. ఇది ఒక కొత్త అనుభవం అని పేర్కొన్నారు. ఇప్పుడున్న యంత్రాంగంలో చేరి ఎలా పని చేయాలో ఆలోచిస్తున్నానని చెప్పారు. ఎమ్మెల్సీ అనేది ఒక అవకాశం అని.. మరింత సేవ చేయడానికి దీన్ని ఉపయోగిస్తానని కోదండరాం చెప్పారు. బీఆర్ఎస్ విమర్శలను తాను పట్టించుకోనని అన్నారు. ప్రజలు అడిగిన వాటికి తాను సమాధానం చెప్తానని చెప్పారు.
గతంలో ఎలా ఉన్నానో.. ఇప్పుడూ.. ఎప్పుడూ అలాగే ఉంటానని అన్నారు. ఇక తనను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని వస్తున్న వార్తలపై ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. ఈ ప్రచారాలకు తాను సమాధానం చెప్పలేనని అన్నారు. మరోవైపు తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి అమీర్ అలీ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు.