ఖమ్మంలో మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించి.. 225 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే రఘునాథపాలెంలో మినీ ట్యాంక్ బండ్ను ప్రారంభించారు. రేగులచెలకలో రోడ్డు వైండింగ్ పనులను ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఐటీ హబ్లో 12 కంపెనీలు ప్రారంభించామని తెలిపారు. ఐటీ హబ్ ఫేజ్ 2 కోసం 20 కోట్లు త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. ఖమ్మం యువత ఐటీ హబ్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ వచ్చిన ఆరేళ్లలోనే ఖమ్మం జిల్లా స్వరూపం మారిపోయిందని... పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు కేటీఆర్. త్వరలో దాదాపు 1400 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రజలకు అందిస్తామన్నారు. కేవలం ఎన్నికల వేళ మాత్రమే రాజకీయమని.. మిగతా సందర్భాల్లో అందరూ కలసి అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఇక మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారత రత్న ఇస్తేనే ఆయనకు అసలైన నివాళి అన్నారు మంత్రి కేటీఆర్.
మరోవైపు కేటీఆర్ పర్యటనలో మంత్రుల బృందాన్ని అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించారు. NSP కెనాల్పై నిర్మించిన వాక్ వే ట్రాక్ను ప్రారంభించేందుకు వెళ్తుండగా తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. నో ఎల్ఆర్ఎస్.. గో టీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ట్ స్టేషన్కు తరలించారు.