తెలుగుదేశం పార్టీ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తూ... టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో.. పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, జాతీయ ప్రధాన కార్యదర్శులు కంభంపాటి రామ్మోహన్, బక్కని నర్సింహులు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు సామ భూపాల్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. మాటలకే పరిమితమైన టీఆర్ఎస్ పార్టీ కావాలో.. అభివృద్ధి చేసే తెలుగు దేశం పార్టీ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు ఎల్.రమణ. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే ప్రతి ఇంటికి మంచి నీటి సరఫరా చేయడంతోపాటు పేదలందరికీ ఉచిత నల్లా కనెక్షన్ అందిస్తామన్నారు. పూర్తిస్థాయిలో వైఫై నగరంగా చేయడానికి కృషి చేస్తామన్నారు. అలాగే ప్రతి ఇంటికి పైప్లైన్ల ద్వారా వంటగ్యాస్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. పేదవారందరికీ పక్కా గృహాలు నిర్మిస్తామని.. మేనిఫెస్టోలో తెలిపారు.