KAVITHA: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో "లీడర్"
లీడర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కవిత..యువతను రాజకీయాల్లోకి రప్పించడమే లక్ష్యం;
తెలంగాణ యువత, మహిళలకు రాజకీయ శిక్షణ అందించేందుకు తెలంగాణ జాగృతి 'లీడర్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువతను రాజకీయాల్లోకి రప్పించి, సమాజంలో మార్పు తీసుకురావడానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. యువత, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదికగా మారబోతుందని తెలిపారు. రాజకీయాల్లోకి యువత రావడం ద్వారా స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. యువత, మహిళలు, తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రతీ ఒక్క నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నామని కవిత పేర్కొన్నారు. చేసే పోరాటాలకు కూడా ఫలితం వచ్చే రోజు వస్తుందని ఆమె చెప్పారు. మహిళా రిజర్వేషన్ల చట్టం వచ్చినందున.. రాబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో 33 శాతం మహిళా అభ్యర్థుల నాయకులు కావాల్సిన అవసరం ఉంటుందని గుర్తు చేశారు.
ప్రశ్నించే తత్వానికి ప్రాధాన్యం
తెలంగాణ గడ్డ అంటే ప్రశ్నించే తత్వం అని కవిత పేర్కొన్నారు. ప్రశ్నించే తత్వం మనతో ఆగవద్దని, ముందు తరాలకూ ప్రశ్నించే తత్వాన్ని నేర్పించాలని కవిత కోరారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో ప్రశ్నించే ఆలోచనలను ప్రోత్సహించడం ముఖ్యమని స్పష్టం చేశారు కవిత. దీని కోసం తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ నెల మూడు రోజులపాటు శిక్షణా తరగతులు నిర్వహించబడతాయన్నారు. జులైలో హైదరాబాద్లో ప్రారంభించి, ఆగస్టు నుంచి జిల్లాల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంపై ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొనాలని కవిత కోరారు. ఇది ఒక నిరంతర కార్యక్రమంగా కొనసాగుతుందని ఆమె వెల్లడించారు. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 153కు పెరుగుతాయని, లోక్ సభ సీట్లు కూడా పెరుగుతాయని అన్నారు. కాబట్టి, మనం నాయకులను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.