AP: ఇమామ్‌లు, మౌజన్లకు రంజాన్ కానుక

శుభవార్త చెప్పిన కూటమి ప్రభుత్వం

Update: 2026-03-17 08:00 GMT

రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ఇమామ్‌లు, మౌజన్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వారి గౌరవ వేతనాల బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం రూ.45 కోట్ల నిధులను విడుదల చేసింది. గత ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను ఒకేసారి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ బకాయిలను వెంటనే విడుదల చేయాలని నిర్ణయించి సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంది. ఆ హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఆర్థిక శాఖ నుంచి నిధుల విడుదలకు అనుమతి లభించడంతో ప్రక్రియ వేగవంతమైంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 10 వేల మంది ఇమామ్‌లు, మౌజన్లు లబ్ధి పొందనున్నారు.

ప్రభుత్వ వివరాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న సుమారు 5 వేల మంది ఇమామ్‌లకు ఆరు నెలల గౌరవ వేతన బకాయిల కింద రూ.30 కోట్లను కేటాయించారు. అలాగే మరో 5 వేల మంది మౌజన్లకు ఆరు నెలల బకాయిలుగా రూ.15 కోట్లను విడుదల చేశారు. ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. పండుగ వేళలోనే బకాయిలు విడుదల కావడం పట్ల ముస్లిం మత పెద్దలు మరియు ఇమామ్‌లు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News