Hyderabad : ఇవాళే ఆరాంఘర్-జూపార్క్ పొడవైన ఫ్లై ఓవర్ ప్రారంభం

Update: 2025-01-06 08:00 GMT

హైదరాబాద్‌ లో మరో అద్భుతమైన ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఇవాళ ఆరాంఘర్‌- జూపార్కు ఫ్లైఓవర్‌ ప్రారంభంకానుంది. సాయంత్రం 4గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు హైవేకు ఉన్న ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు ఆరాంఘర్‌ నుంచి జూపార్కు వరకు 4.08 కిలోమీటర్ల పొడవునా ఫ్లై ఓవర్‌ నిర్మించారు. దీనికి దాదాపు 800 కోట్ల రూపాయలు వెచ్చించింది బల్దియా. హైదరాబాద్‌లో రోజురోజుకూ ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో వాహనదారులు తీవ్రఇబ్బంది పడటమే కాకుండా కోట్లాది రూపాయల ఇంధనం, విలువైన సమయం వృథా అవుతోంది. నగరంలోని ముఖ్యప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్దీకరించేందుకు జీహెచ్‌ఎంసీ వ్యూహాత్మకరహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా ఫ్లై ఓవర్‌ లు, ఆర్వోబీలను నిర్మిస్తూ ట్రాఫిక్ ఇక్కట్లను దూరంచేస్తోంది. ఆరాంఘర్-జూపార్క్ పైవంతెన పీవీ ఎక్స్‌ప్రెస్‌ ఫ్లైఓవర్‌ తర్వాత నగరంలో రెండో అతిపెద్ద వంతెన. దీనిని ఆరు లేన్లతో119 పిల్లర్లతో 4.08 కిలోమీటర్ల మేర చేపట్టిన అతి పొడవైన ఫ్లై ఓవర్‌ ఇది.

పాతనగరంలో ఇప్పటికే పలు ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది. ఓవైసీ ఫ్లై ఓవర్‌, అబ్దుల్‌ కలాం ఫ్లై ఓవర్‌, చాంద్రాయణ గుట్ట ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి తీసుకురాగా..ఆరాంఘర్‌-జూపార్కు ఫ్లై ఓవర్‌తో శంషాబాద్‌ విమానాశ్రయం వరకు ప్రయాణం సాఫీగా సాగనున్నది. ఆరాంఘర్‌, శాస్త్రిపురం, కాలాపత్తర్‌, శివరాంపల్లి, హసన్‌నగర్‌ జంక్షన్లలో ట్రాఫిక్‌ రద్దీకి శాశ్వత ఉపశమనం లభించనున్నది. నాగోల్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు రవాణా మెరుగుపరచడమే కాకుండా సిగ్నల్‌ ఫ్రీ రవాణా వ్యవస్థకు దోహద పడనున్నది. 

Tags:    

Similar News