గ్రామానికి ఐదు రోజులుగా తాగునీరు రావడం లేదని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మంచినీటి సమస్యను పరిష్కరిం చిన తర్వాతే జెండాను ఎగురవేయాలని ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామంలో గత ఐదు రోజులు తాగునీరు రాక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద జెండా ఆవిష్కరించేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. హల్దీ వాగు నుంచి గ్రామానికి నీరు సరఫరా చేసేందుకు 20 హెచ్పీ బోర్ మోటార్ ఉండగా.. తరచూ చెడిపోవడంతో ఈ సమస్య ఏర్పడింది. సమస్యను పరిష్కరించేందు కు స్థానిక ఎస్సై జ్యోతి, కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి, సుధాకర్ గౌడ్, మహేష్ రెడ్డి, నరసింహ రెడ్డి అక్కడికి చేరుకొని గ్రామస్తులను సముదాయించారు. తమకు తాగునీటి సమస్య తీర్చే వరకు జెండాను ఆవిష్కరించ వద్దని మొండికేయడంతో సాయంత్రంలోపు బోరు మోటారును ఏర్పాటుచేసి సమస్య తీరుస్తామని హామీ ఇవ్వడంతో జాతీయ జెండాను పంచాయతీ కార్యదర్శి ఎగురవేశారు.