Nagarjuna Sagar : నాగార్జున సాగర్కు కొనసాగుతున్న వరద
సాగర్ 18 గేట్లు ఎత్తిన అధికారులు;
కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ ఉరకలేస్తోంది. నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో సాగర్ 18 గేట్లను ఎత్తి.. దిగువకు 1.14 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో 1.86 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 311.44 టీఎంసీలు కాగా, పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ఇక ఇవాళ సెలవు దినం కావడంతో సాగర్ అందాలను చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు. గేట్లను ఎత్తడంతో.. పాలపొంగులాంటి నీటి దృశ్యాలను పర్యాటకులు తమ కెమెరాల్లో బంధిస్తున్నారు.
కృష్ణమ్మను చూసేందుకు పర్యాటకులు : నాగార్జున సాగర్ జలాశయం రాత్రి పూట విద్యుత్ కాంతులతో సుందరంగా కనిపిస్తుంది. జలకళను సంతరించుకొని దిగువకు దిగుతున్న కృష్ణమ్మను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఆదివారం నాడు వచ్చే వారి సంఖ్య మరింత పెరిగింది. సాగర్ను చూసేందుకు తెలంగాణ టూరిజం వారి ప్యాకేజీ అందుబాటులో ఉంది.
ప్యాకేజీ వివరాలు : హైదరాబాద్ - నాగార్జునసాగర్ - హైదరాబాద్ పేరుతో తెలంగాణ టూరిజం ప్యాకేజీ నడుపుతోంది. ఒక్క రోజులోనే టూర్ ముగిసేలా దీనిని రూపొందించారు. ఉదయం వెళ్లి మళ్లీ రాత్రి వరకు ఇంటికి చేరుకోవచ్చు. ప్రతీ శని, ఆదివారం రోజుల్లో ఈ టూర్ ఉంటుంది. మరిన్ని వివరాలు తెలంగాణ టూరిజం వారి వెబ్సైట్ https://tourism.telangana.gov.in ను సందర్శించండి. పూర్తి వివరాలు తెలుసుకోండి.