ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ ఏయిర్ పోర్టు ఏర్పాటుపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఆదిలా బాద్లో విమానాశ్రయం ఏర్పాటు చేయడం తన బాధ్యత అని, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేసి తీరుతానని ముఖ్యమంత్రి ఇటీవల శాసనసభలో చేసిన ప్రకటన నేపథ్యంలో భారత వాయుసేన పౌర విమా నాశ్రయానికి అంగీకారం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేయడం జిల్లా ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఖానాపూర్ కాలనీకి ఆనుకుని ఉన్న 362 ఎకరాలతో విస్తరించి ఉన్న ఈ మైదానంలో విమానాల రాకపోకలకు నిజాం కాలంలో అనువుగా ఉండేది. స్వాతంత్ర్యానంతరం ఆదిలాబాద్ విమానాశ్రయ ప్రాభవం మరుగునపడటంతో మరోసారి విమానాశ్రయం ఏర్పాటుపై ఉద్యమం సాగింది.
దక్షిణ, ఉత్తర భారతదేశానికి మధ్య భాగంలో తెలంగాణకు ముఖద్వారంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలొ ఏయిర్పోర్టు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి ప్రత్యుత్తరాల ద్వారా లేఖను పంపింది. 2013-2014లో విమానాశ్రయానికి ఈ ప్రాంతం అనుకూలం ఉందా..? పైలెట్ల శిక్షణకు అనువుగా ఉందా..? అనేదానిపై సర్వే జరిపింది. ప్రస్తుతం ఉన్న 362 ఎకరాలతో పాటు విమానాశ్రయం ఏర్పాటు చేయడంతో అదనంగా మరో 1592 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం సమగ్ర నివేదిక కేంద్రానికి పంపింది. ఆదిలాబాద్ రూరల్ మండలం కచ్కంటి, ఖానాపూర్, అన్కుంట, తంతోలి గ్రామాల పరిధిలోకి వచ్చే భూము లను సర్వే చేసిన రెవెన్యూశాఖ సమగ్ర నివేదికను 2014లో హైదరాబాద్ బేగంపేట్లోని ఏయిర్పోర్టు కార్యాలయానికి నివేదిక కూడా సమర్పించింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏయిర్పోర్టు ఏర్పాటుకు ఎన్ఎసీ ఇవ్వకుండా అడ్డుకుంటుందని విమర్శులు కూడా వచ్చాయి.