CM Revanth Reddy : అల్లు అర్జున్ ఎపిసోడ్ పై ఎవరూ మాట్లాడొద్దు.. సీఎం సీరియస్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఎవరూ మాట్లాడకూడదని సీరియస్ అయ్యారు. మీడియా సమావేశాలు, చర్చల్లో ఎక్కడ కూడా ఆ విషయం మాట్లాడవద్దని తెలిపినట్టు సమాచారం. పార్టీ నాయకులు అందరికీ ఈ విషయం సూచించాలని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజున సీఎం రేవంత్ రెడ్డి.. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఎలాంటి ప్రత్యేక షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఆ విషయంపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించి తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అబద్దపు ప్రచారాలు చేస్తున్నారంటూ మాట్లాడారు. ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ నాయకులు అల్లు అర్జున్ పై మాటల దాడికి దిగారు. పార్టీలోని ముఖ్యమైన నేతలంతా బన్నీపై దుమ్మెత్తి పోశారు. ఈ విషయం జాతీయ మీడియాకు కూడ చేరడంతో.. రేవంత్ రెడ్డి అప్రమత్తమై.. ఇకపై నేతలెవరూ అల్లు అర్జున్ ఎపిసోడ్ పై మాట్లాడకూడదని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.