Secunderabad: సికింద్రాబాద్ నుండి రైళ్ల రాకపోకలు బంద్.. దీనస్థితిలో ప్రయాణికులు..
Secunderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరుగుతున్న విధ్వంసం చూసి ప్రయాణికులు చెల్లాచెదురుగా పరిగెత్తారు.;
Secunderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరుగుతున్న విధ్వంసం చూసి ప్రయాణికులు చెల్లాచెదురుగా పరిగెత్తారు. పిల్లల్ని, పెద్దవాళ్లను పట్టుకుని స్టేషన్ బయటకు పరుగులు తీశారు. ఫ్లాట్ఫామ్పై ఉన్న రైళ్లపైనా రాళ్లు వేయడంతో.. ట్రైన్ల నుంచి బయటికి వచ్చి.. స్టేషన్ విడిచి పరిగెత్తారు. రైల్వేస్టేషన్లోని మూడు రైళ్లకు నిప్పుపెట్టే సరికి ప్రయాణికులు మరింత భయభ్రాంతులకు గురయ్యారు.
విధ్వంసం జరిగే సమయానికి స్టేషన్ కిక్కిరిసిపోయి ఉంది. ఫ్లాట్ ఫామ్పై వందల మంది ప్రయాణికులు ఉన్నారు. అదే సమయంలో ఆందోళనకారులు విధ్వంసం మొదలుపెట్టారు. రాళ్లు, కర్రలతో దాడి చేసి.. రైళ్లు, స్టాళ్లకు నిప్పు పెట్టే సరికి ప్రయాణాలు మానుకుని ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు పెట్టారు. ప్రయాణికులు రైల్వే స్టేషన్లో తలదాచుకునే పరిస్థితి కూడా లేదు. స్టాళ్లను కూడా ధ్వంసం చేశారు. కొన్ని స్టాళ్లకు నిప్పు పెట్టారు.
పోలీసులు వచ్చినప్పటికీ ఆందోళనకారులను నిలువరించలేకపోయారు. విధ్వంసకారులు వేల సంఖ్యలో ఉండడం, పోలీసులు వందల మందే ఉండడంతో సాధ్యం కాలేదు. పైగా పోలీసులను చూసిన ఆందోళనకారులు రాళ్లు విసిరారు. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. నిరసనకారులను అదుపు చేయడం పోలీసుల వల్ల కాకపోవడంతో.. స్టేషన్ విడిచి వెళ్లిపోయారు.
త్రివిధ దళాల్లో అగ్నిపథ్ స్కీమ్ను నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో హింసాత్మక ఘటనతో.. రైళ్లలన్నినిలిచిపోయాయి. సమారు 71 ప్యాసింజర్ రైళ్లు రద్దుకాగా..మరిన్నింటిని దారి మళ్లించారు. రైళ్ల రద్దుతో ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు సికింద్రాబాద్లోనే పడి గాపులు పడుతున్నారు. ముందస్తుగా బుక్ చేసుకున్నవారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ముంబై, బీహర్, కోల్కతాకు వెళ్లాల్సిన రైళ్లు.. తిరిగి ఎప్పుడు నడుస్తాయోనన్న ఆవేదనను ప్రయాణికులు వ్యక్తం చేశారు. స్టేషన్ నుంచి బయటకు వెళ్తామంటే బస్సు సౌకర్యమైనా లేకుండా పోయిందన్నారు