రాష్ట్రంలోని మహిళా సమాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా సమాఖ్యల నుంచి ఆర్టీసీ బస్సుల ను హైర్ చేసుకోనుంది. తొలి విడత 150 మండల సమాఖ్యలకు ఒక్కో బస్సు చొప్పన కేటాయిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో బస్సుకు ప్రతి నెలా ఆర్టీసీ రూ. 77, 220 చెల్లించనుంది. బస్సుల కొనుగోలు కోసం మహిళా సమాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ని ఇస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తర్వాత రెండో దశలో మరో 450 మండల సమాఖ్యల నుంచి 450 బస్సులను హైర్ కు తీసుకోనుంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మహిళా సమాఖ్యల ద్వారా బస్సు లను ఆర్టీసీ అద్దెకు తీసుకోవడం ఇది దేశంలోనే తొలిసారి కావడం విశేషం.ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు అయ్యే ఖర్చు, వచ్చే ఆదాయం, నిర్వహణ ఖర్చు తదితర అంశాలన్నింటితో కూడిన సమగ్ర నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అధికారులు సమర్పించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ ఉంది. ఈ క్రమంలో మహిళా సంఘాలకు ఉపాధి కల్పించడంతోపాటు వారు కొనుగోలు చేసిన బస్సులను హైర్ చేసుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది.