గురువారం జరిగిన తెలంగాణ మంత్రి మండలి భేటీలో కీలకమైన రాజకీయ అంశాలు చర్చించే సమయం పెద్దగా లభించలేదు. ఉద్యోగుల సమస్యలపైనే ఎక్కువ సమయం కేటాయించినట్టు సమాచారం. సమయం మించిపోవడంతో మరో 15, 20 రోజుల్లో మరోమారు మంత్రి మండలిని సమావేశపరచాలని, అందులో అన్ని అంశాలు మాట్లాడుకుందామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును తేదీ నిర్ణయించి సమాచారం అందించాలని చెప్పినట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వార్డుల విభజన ప్రక్రియతోపాటు రిజర్వేషన్ల ఖరారు జరుగుతోందని, ఈ నెల లోపు ఇది పూర్తవుతుందని, ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లవచ్చని సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా ఉందని, ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని మంత్రులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.