Simhayaji Release: నిందితుడు సింహయాజీ చంచల్గూడ జైలు నుంచి విడుదల
Simhayaji Release: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు నిందితుడు సింహయాజీ చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు.;
Simhayaji Release: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు నిందితుడు సింహయాజీ చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులకు తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 1వ తేదీనే బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు గాను మూడు లక్షల రూపాయల పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది.
కాని, పూచీకత్తు సమర్పించకపోవడంతో వారం రోజులుగా జైల్లోనే ఉన్నారు. సింహయాజీ తరపు న్యాయవాది నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో 6 లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు జామీను సమర్పించారు. దీంతో కోర్టు బెయిల్ పత్రాలు మంజూరు చేసింది.
పూచీకత్తు సమర్పించడంతో ఈ ఉదయం చంచల్ గూడ జైలు నుంచి సింహాయాజీ బయటికొచ్చారు. బెయిల్పై విడుదలైనా.. ప్రతి సోమవారం సిట్ ముందుకు రావాలని హైకోర్టు ఆదేశించింది. ముగ్గురు నిందితుల పాస్ పోర్టులను కూడా స్టేషన్లో సరెండర్ చేయాలని హైకోర్టు తెలిపింది.
మరోవైపు రామచంద్రభారతి, నందకుమార్ మాత్రం బెయిల్ మంజూరైనా జైల్లోనే ఉన్నారు. రామచంద్ర భారతి, నందకుమార్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులుండటం వలన ఇద్దరూ చంచల్ గూడ జైల్లోనే ఉండాల్సి వస్తుంది.
నకిలీ ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సుల నకిలీ ధ్రువపత్రాలకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ నకిలీ ధ్రువ పత్రాలతో ఎక్కడెక్కడ మోసాలకు పాల్పడ్డారనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు.
మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్కు నాంపల్లి ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, లాయర్ శ్రీనివాస్ను నిందితులుగా చేర్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ కేసును దర్యాప్తు చేసే అధికారం సిట్కి లేదని ఏసీబీ స్పెషల్ కోర్టు తేల్చిచెప్పింది.
ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ గ్రౌండ్లో సిట్ దాఖలు చేసిన మెమోను తిరస్కరించారు. పీసీ యాక్ట్ కేసుల్లో ఏసీబీకి మాత్రమే దర్యాప్తు అధికారం ఉందని, లా అండ్ ఆర్డర్ పోలీసులకుగానీ, సిట్కుగానీ ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం లేదని స్పష్టం చేశారు.