వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో దర్యాప్తు ప్రక్రియ మళ్లీ వేగమందుకుంది. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ విచారణకు హాజరుకావాలని సీఐడీ మరోసారి తాఖీదులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. రూ.1400 కోట్ల స్కామ్ లో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ తో పాటు మరో 29 మంది నిందితులున్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఐజీఎస్టీ, ఇతర పన్ను ఎగవేతల నిరోధానికి అవసరమైన యాప్స్, మాడ్యూల్స్ ను ఐఐటీహెచ్ అభివృద్ధి చేయించడంలో కీలకంగా వ్యహరించిన వారిలో 29 మందిని విడతల వారీగా సీఐడీ అధికారుల బృందం విచారించినట్లు సమాచారం. వీరిలో 8మంది జాయింట్ కమిషనర్లు, 8 మంది డిప్యూటీ కమిషనర్లు, ఐదుగురు అసిస్టెంట్ కమిషనర్లు, నలుగురు స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్లు, ముగ్గురు డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ కేసులో అనుమానితులు, నిందితుల విచారణ దాదాపు పూర్తి కావచ్చిందని అనతికాలంలో సీఐడీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం.