Telangana Assembly : సుదీర్ఘ ప్రసంగాలు వద్దు..సభ్యులకు స్పీకర్ గడ్డం ప్రసాద్ సూచన
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. మంత్రి శ్రీధర్బాబు శాసనసభలో స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టారు. మరో 19 పద్దులపై చర్చ కొనసాగుతోంది. వ్యవసాయం, సహకార, నీటిపారుదల, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, గృహనిర్మాణం, పౌర సరఫరాలు, పశుసంవర్ధక, పర్యాటక, క్రీడాశాఖల పద్దులపై చర్చిస్తున్నారు. సోమవారం నాటి సమావేశాలు మంగళవారం ఉదయం 3.15 గంటల వరకు జరిగాయని ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రస్తావించారు. అయితే సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దని సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. సబ్జెక్ట్పైనే మాట్లాడాలని కోరారు. శాసనసభ వ్యవహారాల మంత్రి సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సుదీర్ఘ ప్రసంగాలు చేయొద్దన్న స్పీకర్ సహా శ్రీధర్ బాబు ప్రతిపాదనకు సహకరిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే సభలో 57మంది కొత్త సభ్యులు ఉన్నారని.. వారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. రోజుకు 19 పద్దులపై చర్చ పెట్టకుండా.. 2 లేదా 3 పద్దులపై చర్చిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలు 20 రోజులు పెట్టాలని సూచించారు.