Minister Komatireddy : తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడటం వేస్ట్ : మంత్రి కోమటిరెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్సీ, కులగణనపై దుమారం రేపిన తీన్మార్ మల్లన్నపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తీన్మార్ మల్లన్న విషయంలో తనకు మాట్లాడేంత సమయం లేదనీ.. మాట్లాడం కూడా వేస్ట్ అంటూ వ్యాఖ్యానించారు. అయితే.. తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ, ఏఐసీసీ, క్రమశిక్షణ ఛైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు ఇచ్చినట్లు పేపర్లో చూశానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 56.6 శాతం బీసీలు ఉన్నట్లుగా తేల్చినట్టు చెప్పారు. బడుగు బలహీన వర్గాలను అన్ని రంగాల్లో పైకి తీసుకొని రావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే పార్టీ పరంగా కచ్చితంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పుకొచ్చారు. 90 శాతం ఉన్న జనాభా కోసమే తెలంగాణ వచ్చిందని.. దొరలు, భూస్వాములు ఫాంహౌసుల్లో ఉండేందుకు కాదని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఫాంహౌస్లో ఉంటూ కులగణలో పాల్గొనకుండా ఉన్న వాళ్లకు మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్లా తాము హడావిడిగా సర్వే చేయలేదన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తాము చేసిన సర్వే రిపోర్టును ప్రజల ముందు పెట్టామని స్పష్టం చేశారు.