Telangana Budget 2024 : నేడు ఓట్​ ఆన్​ అకౌంట్ బడ్జెట్​!

ఆరు గ్యారంటీలకే పెద్దపీట

Update: 2024-02-10 03:00 GMT

రాష్ట్ర బడ్జెట్ ఇవాళ ఉభయ సభల ముందుకు రానుంది. 2024 - 25 ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్థికశాఖ బాధ్యతలు చూస్తున్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శాసనసభలోశాససభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అదే తరహాలో రాష్ట్రంలోనూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్ అంచనాలతో పాటు 2022-23 సంవత్సరానికి చెందిన లెక్కలు, 2023-24 ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాలు కూడా వెల్లడి కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దిశానిర్దేశానికి అనుగుణంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించారు.

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి KCR సర్కార్ రెండు లక్షలా 90 వేల కోట్లకు పైగా బడ్జెట్ తీసుకొచ్చింది. అందులో డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం మొత్తం లక్షా 56 వేల కోట్లకు పైగా ఉంది. పన్ను ఆదాయం లక్ష కోట్ల వరకు... రెవెన్యూ రాబడులు లక్షా పాతికవేల కోట్ల రూపాయలు ఖజానాకు సమకూరాయి. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు 2 లక్షల కోట్లను దాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 30 వేల కోట్ల వరకు పెరగవచ్చని భావిస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని 2024 - 25 వార్షిక బడ్జెట్‌ను ఖరారు చేయనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం బాగానే ఉన్నప్పటికీ.... కొన్ని విభాగాల్లో అంచనాలకు దూరంగానే ఉన్న పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి వస్తాయన్న ఆశతో భారీగా అంచనా వేసిన గ్రాంట్లు కూడా చాలా స్వల్పంగానే వచ్చాయి. రుణాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే తన వైఖరిని స్పష్టం చేసింది. ప్రత్యేకించి కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పుల విషయంలో వ్యతిరేక ధోరణితో ఉన్నారు. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని తాజా బడ్జెట్ రానుంది. ప్రస్తుత బడ్జెట్ అంచనా కంటే స్వల్పంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 2 లక్షలా 90 వేల కోట్ల రూపాయలు కాగా  రానున్న ఆర్థిక సంవత్సరానికి కాస్త పెరిగి రెండు లక్షలా 90 వేల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల మధ్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

శాసనసభ ఎన్నికల అనంతరం లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ కావడంతో ప్రజాకర్షకంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేకించి 6 గ్యారంటీలకు పద్దులో ప్రాధాన్యం దక్కనుంది.  ఓటాన్ అకౌంట్ అయినప్పటికీ ఏడాదికి సరిపడా ప్రతిపాదనలు ఉండనున్నాయి. అయితే పూర్తి బడ్జెట్ తరహాలో సమగ్ర వివరాలు ఉండవు. ఆయా శాఖల పద్దులకు సంబంధించి కూడా పూర్తి వివరాలు ఉండవు. దీంతో పద్దులపై చర్చకు అవకాశం ఉండదు.    

Tags:    

Similar News