KCR Meets Piyush Goyal : కేంద్రమంత్రి పియూష్ గోయల్ తో సీఎం కేసీఆర్ భేటీ...!
KCR with Piyush Goyal : తెలంగాణలో పండిన వరిధాన్యాన్ని కేంద్రంతో కొనిపించేలా సీఎం కేసీఆర్ ఢిల్లీలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.;
తెలంగాణలో పండిన వరిధాన్యాన్ని కేంద్రంతో కొనిపించేలా సీఎం కేసీఆర్ ఢిల్లీలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్నరాత్రి సీఎస్ సోమేష్ కుమార్ తో కలిసి కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పియూష్ గోయల్ తో భేటీ అయిన కేసీఆర్... ఈ రోజు మరోసారి కలిశారు. కేసీఆర్ వెంట ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేష్ నేత, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఉన్నారు. వరిధాన్యం కొనుగోళ్లు అంశంపై దాదాపు గంటన్నరపాటు పియూష్ గోయల్ తో కేసీఆర్ చర్చించారు. ఈసమావేశంలో కేంద్ర పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
ఎఫ్సిఐ ద్వారా ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేలా సీఎం రెండు రోజులుగా ఢిల్లీలో ప్రయత్నాలు చేశారని, ఇందులో భాగంగానే పియూష్ గోయల్ తో మరోసారి భేయి చర్చించారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ చెప్పారు. కేంద్ర మంత్రి నుంచి ఇంకా స్పష్టత రాలేదని, మరో మూడు రోజుల సమయం కావాలని కేంద్రమంత్రి కోరినట్లు తెలిపారు. గతంలోలాగా ధాన్యాన్ని కొనలేమని కేంద్రం రాతపూర్వకంగా రాష్ట్రానికి తెలిపిందన్నారు.