KCR : ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్... వారం రోజుల పాటు అక్కడే మకాం
KCR : జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ టూర్లో సుదీర్ఘ పర్యటనకు శ్రీకారం చుట్టారు.;
KCR : జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ టూర్లో సుదీర్ఘ పర్యటనకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఆయన హస్తినకు బయల్దేరి వెళ్లారు. ఈ సారి వారం నుంచి పది రోజుల పాటు హస్తినలోనే ఉంటారని ప్రగతిభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన వెంట సతీమణి శోభ, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్, పలువురు నేతలు, అధికారులు ఉన్నారు. ఈ పర్యటనలో కేసీఆర్.. రాజకీయ, ఆర్థిక ప్రముఖులతో భేటీకానున్నారు. జాతీయ మీడియా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. సాగుచట్టాల రద్దు ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. రైతు కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని కేసీఆర్ అందించనున్నారు.
ఇప్పటికే... బీజేపీపై సమర శంఖం పూరించింన సీఎం కేసీఆర్... మోదీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా... ముందుకు వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం... ఈ నెల 22న చంఢీగడ్, ఈ నెల 26న బెంగళూరు లో కేసీఆర్ పర్యటిస్తారు. మాజీ ప్రధాని దేవగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ భేటీ అవుతారు. ఈ నెల 27న మహారాష్ట్ర లో కేసీఆర్ పర్యటిస్తారు.
ఈ పర్యటనలో రాలేగావ్సిద్ధిలో అన్నాహజారేతో కేసీఆర్ భేటీ అవుతారు. ఈ నెల 29,30 తేదీల్లో బంగాల్, బిహార్లో కేసీఆర్ పర్యటించనున్నారు. గాల్వాల్ లోయలో మరణించిన సైనిక కుటుంబాలకు సీఎం పరామర్శించనున్నారు. మరణించిన సైనిక కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సాయం అందజేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.