TG: తెలంగాణ మంత్రుల ఇంటింటి ప్రచారం
లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారం... బీజేపీ, బీఆర్ఎస్లపై విమర్శలు;
లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తెలంగాణ మంత్రులు బీజేపీ, బీఆర్ఎస్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో, తెలంగాణలో మత రాజకీయాలు చేస్తున్నారంటూ.. ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థులను అత్యధిక సంఖ్యలో గెలిపించాలంటూ క్షేత్రస్థాయిలో ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కమార్ రెడ్డి.. ఆలేరులో ఇంటింట ప్రచారం నిర్వహించారు. హోటల్లో స్వయంగా అల్పాహారం తయారు చేసిన కిరణ్కుమార్ విప్ బీర్ల ఐలయ్య, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి డ్రైనేజీ శుభ్రం చేసి ఓట్లు అభ్యర్థించారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్కు 15 ఎంపీ స్థానాలలో డిపాజిట్లు కూడా దక్కవవు అంటూ మంత్రి జోస్యం చెప్పారు.
కవిత అరెస్టుపై బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని... మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని వేములవాడలో.. విప్ ఆదిశ్రీనివాస్తో కలిసి.. కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటును అవమానించిన మోదీకి... తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు లేదంటూ... పొన్నం విమర్శించారు. పార్లమెంటరీ ప్రజాస్వామిక దేశంలో రాజ్యాంగం ప్రమాణికమనీ, అలాంటి వాటికి తిలోదకాలిచ్చిన మోదీ ప్రభుత్వం... దేశసంపదను పెట్టుబడిదారులకు దోచిపెడుతుందని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో.. ఆమె MLAవెడ్మ బొజ్జు, MLC వెంకట్ తో కలిసి పాల్గొన్నారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని పిలుపునిచ్చారు.
చేవెళ్ల గడ్డమీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే దిశగా కాంగ్రెస్ నేతలు ఇంటింటి ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సతీమణి సీతా ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, అమలు చేసిన హామీలు వివరిస్తూ…కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తమ వంతు కృషిగా నేతలందరూ కలిసి కట్టుగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెంట రెడ్డి, సురేందర్ రెడ్డి, ఎంపీటీసీలు కుమ్మరి చెన్నయ్య, గుండాల అశోక్, దండు రాహుల్, అంతరం సర్పంచ్ చెన్నయ్య, కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు పల్లాటి అశ్విని, తొంట వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.