Dalit Bandhu : దళితబంధు పథకం కోసం మరో రూ.250 కోట్లు విడుదల..
Dalit Bandhu : ఈ నిధులను దళితబంధును ప్రయోగాత్మకంగా అమలుచేయనున్న నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాలకు కేటాయించారు.;
Dalit Bandhu : దళితబంధు పథకం కోసం మరో 250 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నిధులను దళితబంధును ప్రయోగాత్మకంగా అమలుచేయనున్న నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాలకు కేటాయించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలానికి 100 కోట్లు, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలానికి 50 కోట్లు, నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలానికి 50 కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలానికి 50 కోట్లు విడుదల చేశారు. రాష్ట్ర షెడ్యుల్డ్ కులాల ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ నిధులను విడుదల చేసి సంబంధిత జిల్లా కలెక్టర్ల ఖాతాలో జమ చేసింది.
ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామానికి 7కోట్ల 60 లక్షలు విడుదల చేశారు. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టిన హుజూరాబాద్ నియోజకవర్గానికి 2 వేల కోట్ల నిధులు ఇచ్చారు. మార్చి 2022 నాటికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు దళితబంధు పథకాన్ని విస్తరించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఏడాదికి వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపికచేయనున్నారు. దళితబంధు పథకం అమలు కోసం వచ్చే బడ్జెట్లో 20 వేల కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.