Telangana : 10 మంది నేతలు, లక్షల ఓట్ల మెజార్టీ
రఘువీర్ రెడ్డి ఆల్ టైమ్ హైయెస్ట్ - డీకే అరుణ లోయెస్ట్
అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన చోట కాంగ్రెస్ పార్టీ మళ్లీ సత్తా చాటింది. లోక్సభ ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, భువనగిరి, పెద్దపల్లి నియోజకవర్గల్లో అత్యధిక మెజర్టీ సాధించింది. తెలుగు రాష్ట్రాల లోక్సభ ఎన్నికల్లో ఎన్నడూ ఎవరికి రానంతగా 5లక్షల58 వేల మెజారీతో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపొంది రికార్డు సృష్టించారు. బలమైన నాయకత్వం....క్షేత్ర స్థాయిలో కార్యకర్తల బలంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో హస్తం పట్టు నిలుపుకొంది. 2009 నుంచి నల్గొండలో వరుసగా నాలుగోసారి విజయం సాధించగా....భువనగిరిలో మూడోసారి గెలుపొందింది. 2లక్షల 22వేలకు పైగా మెజార్టీతో చామల కిరిణ్కుమార్ రెడ్డి విజయం సాధించారు. మొత్తానికి నల్గొండ గడ్డ కాంగ్రెస్ అడ్డాగా మరోసారి నిరూపితమైంది. నాయకుల సమన్వయం, కార్యకర్తల శ్రమతోనే విజయం సాధించానని రఘువీర్ రెడ్డి అన్నారు.
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ కైవసం చేసుకుంది. తండ్రి రాజకీయ వారసత్వం పుణికిపుచ్చుకుని ఎన్నికల క్షేత్రంలో తొలిసారి బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి అరంగేట్రంతోనే అదరగొట్టారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 4లక్షల67వేల847 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మంత్రి తుమ్మల నాగేశ్వరారవు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి అత్యధిక ఓట్లు దక్కాయి.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న మధిరలో అసెంబ్లీ ఎన్నికల్లో 35 వేస ఓట్లు ఎక్కువ రాగా ఈసారి 64 వేస ఓట్ల ఆధిక్య లభించింది. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల ఇంఛార్జీ, మంత్రి పొంగులేటి ప్రాతినిథ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికల్లో 61వేల681 ఓట్ల ఆధిక్యం దక్కింది. శాసనసభ ఫలితాలను తలదన్నేలా లోక్సభలో ప్రజా తీర్పు దక్కడంతో హస్తం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.
గిరిజన నియోజకవర్గంమైన మహబూబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 3లక్షల49వేల మెజర్టీ సాధించారు. వరంగల్ అభ్యర్థి కడియం కావ్య 2 లక్షల మెజర్టీతో విజయకేతనం ఎగురవేశారు. అలాగే అధికార హస్తానికి పోటిగా భాజపా ఎంపీ సీట్లను గెలుచుకుంది. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ 3లక్షల 91 వేల మెజర్టీ సాధించారు. కరీంనగర్లో బండి సంజయ్ 2లక్షల 25 వేళ ఆధిక్యంతో గెలుపొందగా చేవేళ్లలో కొండావిశ్వశ్వరెడ్డి లక్ష72 వేల మెజార్టీ కైవసం చేసుకున్నారు. నిజామాబాద్లో ధర్మపురి అర్వింద్ లక్ష పై చిలుకు ఓట్లు సాధించి ఎంపీ స్థానాన్ని పదిలపరుచుకున్నారు