సీఎం రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఏటా డిసెంబర్ 9న అవతరణ దినోత్సవం నిర్వహించి ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం’ ఆలాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తొలి ప్రకటన 2009 డిసెంబర్ 9న వెలువడిన నేపథ్యంలో ఇదే రోజు పండుగలా నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపు రంగు జాకెట్, నుదుటన తిలకంతో సగటు తెలంగాణ మహిళలా తెలంగాణ తల్లి రూపం ఉంది. చేతిలో మక్కజొన్న, వరి, జొన్న సజ్జలను ఉంచారు. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిళ్లను పెట్టారు. రాష్ట్రంలోని సగటు మహిళను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
కాంస్య విగ్రహం ఎత్తు 17 అడుగులు కాగా.. విగ్రహాన్ని ఇప్పటికే సెక్రటేరియెట్ ప్రాంగణానికి తరలించారు. మరో 3 అడుగులతో కిందిగద్దె రూపొందించారు. సుమారు ఐదున్నర కోట్ల రూపాయలతో తెలంగాణ తల్లి విగ్రహం, పరిసరాల్లో ఫౌంటెయిన్, పచ్చిక బయళ్లను తీర్చిదిద్దారు. తెలంగాణ తల్లి విగ్రహం మారినప్పటికీ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ తెలంగాణ తల్లి చిత్రానికి రూపకల్పన చేశారు. ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం కాంస్య విగ్రహాన్ని తయారు చేసింది.