మాంసం ఉత్పత్తితో పాటు మాంసాహార వినియోగంలోనూ తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో దూసుకెళ్తుంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రా లతో పోలిస్తే మాంసాహారం వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు నేషనల్ శాంపిల్ సర్వే. నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డేటా ప్రకారం... దేశంలోనే మాంసాన్ని ఎక్కువగా భుజిస్తున్న ప్రజలున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ సర్వే లెక్కల ప్రకారం.. ఏడాదిలో తెలంగాణ రాష్ట్రంలోని ఒక వ్యక్తి సగటున ఏటా 23.97 కిలోలు మాంసం తింటున్నాడు. అంటే దాదాపుగా ప్రతి నెల రెండు కిలోల చొప్పున రాష్ట్రంలోని ఒక్కో వ్యక్తి మాంసాహారాన్ని భుజిస్తున్నారు. ఇంతలా మాంసాన్ని ఆహారంగా తీసుకుంటున్న ప్రజలు దేశంలోని ఏ రాష్ట్రం లో కూడా లేరని సర్వే గణాంకాలు చెబుతున్నాయి.
సాధారణంగా తెలంగాణలోని ప్రతీ ధావల్లో, అది చిన్నదైనా, పెద్దదైనా మాంసాహారం ఉండాల్సిందే. మటన్ లేదా చికెన్ ఏదో ఒకరకమైన మాంసహార వంట ఉంటే ఆ సందడి వేరు. కొవిడ్ ఎఫెక్ట్ తో తెలంగాణలో చికెన్ ధరలు కొండెక్కాయి. గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు అమాంతం పెరిగి పోయాయి. ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్ తదితర నగరాల్లో కిలో చికెన్ ధర రూ. 260 నుంచి రూ. 280 మధ్య ఉంది. వారం రోజుల్లోనే ధర సుమారు 20-30 రూపాయలు పెరిగినట్లువ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఈ ధరలు మరింతగా పెరిగాయని సమాచారం. కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో, ప్రోటీన్ అవసరాల కోసం చికెన్ తింటున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.