రేవంత్ సర్కార్ ప్రభుత్వ ఆస్పత్రులను నిర్లక్ష్యం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు వైద్య సేవలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకొన్న నిర్లక్ష్యంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అక్రమ కేసులపై ఉన్న మోజు.. ఆరోగ్య శాఖపై లేకపాయే అని కేటీఆర్ విమర్శించారు. అడ్డగోలు సంపాదనపై ఉన్న మోజు.. పెద్దాసుపత్రుల ఆలన పాలనపై లేకపాయే అని మండిపడ్డారు. కుటిల రాజకీయాలపై ఉన్న మోజు.. రోగుల కష్టాలపై లేకపాయే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
ముళ్ల కంచెలపై ఉన్న మోజు.. ఆసుపత్రుల్లో మందుల కొరతపై లేకపోయిందని తీవ్రంగా విమర్శించారు. పోలీసు ఉద్యోగాలు ఊడపీకడంపై ఉన్న మోజు.. ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత పై లేదన్నారు. గుండె పట్టేస్తుంది ఆయాసంగా ఉందనివస్తే పక్కనున్న ప్రయివేట్ ఆసుపత్రికి పొమ్మనబట్టే.. పైసలే ప్రామాణికమై, పైసల పాలనలో అన్ని రంగాల్లో అవేదనలు, అవస్థలు, అన్యాయాలే కనబడుతున్నాయని కేటీఆర్ నిప్పులు చెరిగారు.