సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్కుమార్ హయాంలో రంగారెడ్డి జిల్లాలో జరిగిన భూ కేటాయింపులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టేందుకు పోలీసు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూములకు సంబంధించి అక్రమ కేటాయింపులు జరిగాయంటూ తమకు ఫిర్యాదులు అందినట్లు ఈడీ ఇప్పటికే తెలంగాణ డీజీపీకి నివేదిక సమర్పించింది. ఈ వ్యవహారంలోనే గతంలో మహేశ్వరం ఠాణాలో నమోదైన కేసును మూసేశారని, దాన్ని తిరిగి దర్యాప్తు చేయాలని కోరింది. అప్పటి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్, ఆర్డీవో వెంకటాచారి, తహసీల్దారు ఆర్.పి జ్యోతిలను పలు విడతలుగా విచారించి సేకరించిన సమాచారాన్ని డీజీపీకి ఈడీ అధికారులు స్వయంగా కలిసి అందజేశారు.