Road Accident : మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
మహబూబ్నగర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అడ్డాకుల మండలం కాటవరం స్టేజి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కంటెయినర్ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను అష్రస్ ఉన్నిసా, హసన్, ఎల్లమ్మగా గుర్తించారు. గాయపడిన ఐదుగురిని 108 అంబులెన్స్ లో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 31 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనతో కాటవరం స్టేజి వద్ద జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.