TIRANGA YATRA: పీఓకే అప్పగించాల్సిందే: వెంకయ్యనాయుడు
హైదరాబాద్లో తిరంగా యాత్ర.. పాల్గొన్న బీజేపీ అగ్రనేతలు, ప్రముఖులు;
పహల్గామ్ ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. ట్యాంక్బండ్ వద్ద ఉన్న డాక్టర్. బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి ప్రారంభమైన ‘తిరంగా ర్యాలీ’.. సచివాలయం జంక్షన్ మీదుగా సైనిక ట్యాంక్ వరకు కొనసాగింది.
భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే మీ దేశం మిగలదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు నేతలు హెచ్చరించారు. ఉగ్రవాదులను, దుండగులను ఐక్యతతో అంతం చేస్తామని తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషించే పాకిస్తాన్ కు ఖబర్దార్ బిడ్డ అంటూ సంకేతాలు ఇచ్చిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీది, భారత సైన్యానిధి అన్నారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత సైనికులు ధీటుగా సమాధానం చెప్పారని కిషన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో స్లీపింగ్ సెల్స్ ఉన్నాయి.. వాళ్లను గుర్తించాలని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. కొంతమంది సన్నాసులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్యాబినెట్ లో ఉంటారు కాబట్టి.. అనుమతి తీసుకోవాలి.. ఒక నెల రోజులు సైన్యంలోకి ఈ సన్నాసులను తీసుకెళ్లాలి అని సూచించారు.