దత్తత గ్రామాలకు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలి - రేవంత్ రెడ్డి
Revanth Reddy: గ్రామాల దత్తత పేరుతో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు
గ్రామాల దత్తత పేరుతో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. మేడ్చల్ జిల్లా మూడుచింతల పల్లిలో దీక్ష చేపట్టిన రేవంత్ టీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. దత్తత గ్రామాలకు కేసీఆర్ ఇంతవరకు ఏమీ చేయలేదని ఒకవేళ తన ఆరోపణలు తప్పైతే నిరూపించాలని.. రేవంత్ సవాల్ విసిరారు. ఒకవేళ తాను చెప్పింది తప్పు అయితే ముక్కు భూమికి రాసి ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు.
తెలంగాణలో ప్రజా ప్రతినిధులు ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి లేదని రేవంత్ విమర్శించారు. వికారాబాద్ జిల్లాలో ఓ సర్పంచ్ అభివృద్ధి పనుల కోసం సొంత డబ్బులు ఖర్చు చేసి.. అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. దీనంతటికీ కారణం దివాళా తీయడం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్కు 16 వేల కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పగిస్తే వారికి పాలన చేతగాక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ రేవంత్ మండిపడ్డారు.